చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేసి స్థానిక యువత ఉపాధికల్పనకు చర్యలు చేపడుతున్నాం : కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా
అల్లూరిని స్మరించుకునే విధంగా దేశరాజధానిలో కార్యక్రమాలు చేపడతాం
అల్లూరి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు.. యావద్దేశానికి ప్రేరణామూర్తి
ప్రధానమంత్రి పంద్రాగస్టు ప్రసంగంలోనూ అల్లూరి శౌర్యప్రతాపాల ప్రస్తావన
రంప ఉద్యమం శతజయంతి సందర్భంగా అల్లూరి నడయాడిన ప్రాంతం చింతపల్లిలో కేంద్ర మంత్రులు శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ అర్జున్ ముండా పర్యటన
చింతపల్లి గ్రామంలో అల్లూరి విగ్రహ ఆవిష్కణ
అల్లూరి సహచరుడు గంటం దొర కుటుంబ సభ్యులకు పక్కా ఇళ్ల పట్టాలు అందజేత
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ఓ ప్రత్యేకమైన అధ్యాయమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ సంపదను దోచుకునేందుకు వచ్చిన బ్రిటిషర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి మనమంతా పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
రంప ఉద్యమం శతజయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు నడయాడిన చింతపల్లి ప్రాంతంలో క్షత్రియ సేవా సమితి (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ అర్జున్ ముండా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం, అల్లూరి అతని అనుచరులు మొట్టమొదటగా దాడిచేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి ప్రధాన అనుచరుడైన స్వాతంత్య్ర సమరయోధుడు గంటం దొరకు సంబంధించిన 11 కుటుంబాలకు పక్కా ఇళ్ల పట్టాలను అందజేశారు. మన్యం వీరుడి శౌర్యగాథలను ప్రస్తావిస్తూ డాక్టర్ కర్నం సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతానికో, ఉత్తరాంధ్ర ప్రాంతానికో చెందిన నాయకుడు మాత్రమే కాదని, యావద్భారతానికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ‘తెలుగు జాతి యుగ పురుషుడు – అల్లూరి సీతారామరాజు’ అని కొనియాడిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. పంద్రాగస్టునాడు ఎర్రకోట ప్రసంగంలోనూ అల్లూరి పరాక్రమం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్ సహా అల్లూరి చరిత్రకు సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మన్యం ప్రజలను వేధించడం ఆపకపోతే చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తామని హెచ్చరించి మరీ దాడికి పాల్పడిన ధీరత్వం అల్లూరి, వారి అనుచరులదని ఆయన అన్నారు.
అల్లూరి శౌర్య పరాక్రమాల గురించి భారతీయులందరికీ తెలిసేలా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ.. గిరిజనులు ఎక్కడున్నా తమ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కు తగ్గరని అటువంటి వీరుల వంశం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసేందుకు విప్లవ మార్గంలో ప్రజల్లో చైతన్యం రగిలించారన్నారు. ఆదివాసీల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేసి స్థానిక యువత ఉపాధికల్పనకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక రాజన్నదొర, అరుకు ఎంపీ (లోక్ సభ) శ్రీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే శ్రీ కె.భాగ్యలక్ష్మి, అరుకు ఎమ్మెల్యే శ్రీ చిట్టి ఫాల్గుణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.