-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కె.కోటపాడు,ఫిబ్రవరి22(ఆంధ్రపత్రిక):మార్చి తొలి వారంలో విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చిస్తామని సి.పి.ఐ.రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్సనలో భాగంగా బుధవారం రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం మండలంలో సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. రౌండ్ టేబుల్ మీటింగ్ అనంతరం కేంద్ర జలవనరుల శాఖమంత్రి షెకావత్ ను కలిసి నిధుల విడుదల చేయాలని కోరనునట్లు తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్ సుజలస్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రజలకు కలగా మిగిలిపోయి కాగితాలకే పరిమితంగా కనిపిస్తుందని, కార్యాచరణ కానరాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలు పట్టణాలకు త్రాగునీరు లభిస్తుందన్నారు.అంతే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందితప్ప గతనాలుగు ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2009 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నిధులు కూడా ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. ఆర్.ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం లేదని హైదరాబాదులో ఉన్న పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలన్న డిమాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2008లో ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి నేటికి 15 ఏళ్ళు పూర్తి కావస్తున్నా పనులు ప్రారంభించచలేదన్నారు. ఉత్తరాంధ్రపై సీత కన్ను వేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం నుండి వచ్చే ఎడమ కాలువ ద్వారా కె.కోటపాడు మండలంలో ఉన్న భూదేవి ప్రాజెక్టు ప్రాంతంలో 6.57 టీఎంసీ నీటిని నిలువ చేస్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 79 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాంతానికి నీరు అందించవచ్చన్నారు. త్రాగునీటికి సాగునీటికి ఈ ప్రాంత ప్రజలకు డోకా ఉండదని అన్నారు. ఇటువంటి బృహత్తరమైన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం కూడా నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బృందంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు, అక్కినేని వనజ, జి. ఈశ్వరయ్య, డేగ ప్రభాకర్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ విమల సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రాము నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు డి.సిహెచ్. క్రాంతి కుమార్, జి.గురుబాబు, బి. సుబ్బలక్ష్మి, ఆర్.అప్పలరాజు చెరకు రైతు సంఘం ఉపాధ్యక్షులు వేచలపు కాసుబాబు, మండల కార్యదర్శి గొర్ల దేవుడుబాబు, ఇల్లాకు రాము, రెడ్డి అప్పలనాయుడు శ్రీనివాస నాయుడు పొంతపల్లి రామారావు తదితరులు ఉన్నారు.