Karni Sena : కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక్త ఆపరేషన్లో అరెస్టు చేశారు.
నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీతో పాటు వారి సహచరుల్లో ఒకరైన ఉద్ధమ్ చండీగఢ్లో దొరికారు. రాజస్థాన్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్,ఆయుధాల వ్యాపారి రోహిత్ గోదారా ,అతని సన్నిహితుడు వీరేంద్ర చరణ్ ఆదేశాల మేరకు ఈ హత్య చేశామని నితిన్ ఫౌజీ పోలీసుల ముందు అంగీకరించాడు.గతంలో దొంగతనం కేసుకు సంబంధించి పోలీసు అధికారులు నితిన్ ఫౌజీని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. నవంబర్ ప్రారంభంలో నితిన్ ఫౌజీ హర్యానా పోలీసుల బృందంపై కాల్పులు జరిపాడు. నవంబర్ చివరి వారంలో నితిన్ ఫౌజీ రోహిత్ గోదార, వీరేంద్ర చరణ్ సహాయకుడు రాపుట్తో సంప్రదించాడు. గోగమేడిని చంపడంలో వారికి సహాయం చేస్తే నకిలీ పాస్పోర్ట్ , కెనడియన్ వీసా ఇప్పిస్తానని వారు అతనికి హామీ ఇచ్చారని తేలింది.జైపూర్లో హత్య తర్వాత నిందితులు నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్ రాజస్థాన్లోని దీద్వానాకు, హర్యానాలోని దారుహెడాకు పారిపోయారు. ఈ హత్య కేసులో నిందితుల ఆచూకీ చెబితే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.దారుహెడా నుంచి నిందితులు బస్సులో హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి వెళ్లి, తిరిగి చండీగఢ్కు వస్తుండగా ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ పోలీసుల సంయుక్తంగా పట్టుకున్నారు.