తెలంగాణకు సంబంధించిన FLS మంజూరైన ప్రాజెక్టుల్లో.. మొదటిది దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయనుంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది. ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్తోనూ, ముంబై తోనూ, అటు నాగ్పూర్ మీదుగా..
తెలంగాణకు సంబంధించిన FLS మంజూరైన ప్రాజెక్టుల్లో.. మొదటిది దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయనుంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది. ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్తోనూ, ముంబై తోనూ, అటు నాగ్పూర్ మీదుగా దేశరాజధాని ఢిల్లీతో ఈ మార్గం అనుసంధానం చేస్తుంది. ఇది ఈ రెండు పాత జిల్లాల చిరకాల కోరిక. ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ గా ఈ ప్రాజెక్ట్ మారుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మార్కెట్కుతరలించేందుకు వీలవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 317 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ. 5,706 కోట్లు.
రెండో మెగా ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి.. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్కు ఈ ప్రాజెక్టు అనుసంధానం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ ఈ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ద్వారా అనుసంధానం అవుతాయి. రైతుల మేలు కోసం కాటన్ ఎగుమతికి, బియ్యం రవాణాకు, గ్రానైట్ తరలింపునకు.. ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు కూడా ఈ రైల్వే లైన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 296 కి.మీ, అంచనావ్యయం సుమారు: రూ.5,330 కోట్లు.
మూడో కీలకమైన ప్రాజెక్టు కాచిగూడ (ఉందానగర్) నుంచి జగ్గయ్యపేట రంగారెడ్డి జిల్లా మీదుగా.. చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. 65వ నెంబరు జాతీయ రహదారికి (విజయవాడకు వెళ్లే) సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. అంతేకాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతిలను కలిపే అతి తక్కువ దూరం కలిగిన రైల్వే మార్గం ఇది కాబోతున్నది. ఈ ప్రాంతంలో ప్రజారవాణాకు, వాణిజ్య అవసరాలకు ముఖ్యంగా.. సిమెంట్ ప్లాంట్లకు కొత్త లైన్ ద్వారా చాలా లబ్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పొడవు: 228 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.4,104 కోట్లు.నాలుగో ముఖ్యమైన ప్రాజెక్టు కరీంనగర్ – హసన్పర్తి లైన్. మానకొండూరు, హుజూరాబాద్ లను నేరుగా హైదరాబాద్ తో కలుపుతుంది. గ్రానైట్ ఉత్పత్తులను నేరుగా కాకినాడ ఓడరేవుకు పంపేందకు ఈ రూట్ చాలాకీలకం కానుంది. ఈ ప్రాజెక్టు పొడవు: 62 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ.1,116 కోట్లు.
ఐదో ముఖ్యమైన ప్రాజెక్టు భూపాలపల్లి – కాజీపేట కొత్త లైన్. గిరిజన జిల్లాగా పేరొందిన ఆస్పిరేషనల్ జిల్లా అయిన.. భూపాలపల్లి, జగదల్ పేట, మర్రిపల్లి ని మెయిన్ ట్రంక్ తో అనుసంధానం చేస్తుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క, సారలమ్మ కు వేళ్లే భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగ పడుతుంది. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గును పవర్ ప్లాంట్లకు తరలించేందుకు, లేటరైట్, డోలమైట్, నల్లగ్రానైట్, సున్నపురాయి తదితర సహజ వనరులను బహిరంగ మార్కెట్ కు తీసుకెళ్లేందుకు కూడా ఈమార్గంలో ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు. ప్రాజెక్టు పొడవు: 64 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ.1152 కోట్లు.
వికారాబాద్ – కృష్ణ మధ్య కొత్త లైన్.. ఇది తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణ్ పేట వంటి ప్రాంతాలను కలుపుతుంది. వికారాబాద్, తాండూరు ప్రాంతం నుంచి ప్రజారవాణాకు మరియు సిమెంట్ క్లస్టర్ కోసం సరుకు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. హుబ్లీ, కొల్హాపూర్ (మహాలక్ష్మి ఆలయం), గోవా వెళ్లేందుకు సులభమైన మార్గం. ఈ ప్రాజెక్టు పొడవు: 122 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ.2196 కోట్లు.
మరో అతిముఖ్యమైన ప్రాజెక్టు.. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు (ORR). తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక గేమ్ చేంజర్ ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (RRR) చుట్టూ ఏర్పాటుచేయనున్న రైల్ ప్రాజెక్టు ఇది. వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా 40% తెలంగాణ ప్రాంతంలో విస్తరించే ఈ ప్రాజెక్టు.. ద్వారా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్నగర్, షాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలు అనుసంధానం చేస్తూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడుతోంది. రీజనల్ రింగ్ రోడ్డులో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న కొత్త శాటిలైట్ టౌన్షిప్లు, వాణిజ్య ప్రాంతాలు, ఐటీ జోన్లు, పారిశ్రామిక జోన్లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పొడవు: 564 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.12,408 కోట్లు.
ఎంఎంటీఎస్ – ఫేజ్ 2.. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు కొనసాగింపు. యాదాద్రిని ఎంఎంటీఎస్ తో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తోంది. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందడం లేదు. దీంతో ఈసారి.. వీటన్నింటినీ పక్కనపెట్టి వందశాతం కేంద్ర ప్రభుత్వమే అన్నీ ఖర్చులు భరిస్తూ ఈ మార్గాన్ని పూర్తిచేయాలని నిశ్చయించింది. దీంతోపాటుగా ఘట్ కేసర్ నుంచి వంగపల్లి వరకు ఫోర్ లైన్ పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా జరగనున్నాయి. ఈ మార్గంలో పెరుగుతున్న రాజధానికి ప్రయాణీకుల రద్దీని తట్టుకోవడంతోపాటు యాదాద్రికి వెళ్లే భక్తులకు ఈ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మార్గం పొడవు: 40 కి.మీ, అంచనా వ్యయం సుమారుగా.. రూ.980 కోట్లు.
కీలకమైన ప్రాజెక్టు మణుగూరు-రామగుండం లైన్ . భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి గనులను.. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని గనులతో అనుసంధానం చేసే రైల్వే లైన్ ఇది. దీంతోపాటుగా ఇటీవలే యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి అనుసంధానమయ్యే ఈ లైన్.. సందర్శకులు/పర్యాటకుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గిరిజన ప్రాంతాలను ఢిల్లీకి అనుసంధానం చేస్తుంది. లైన్ పొడవు: 200 కి.మీ, సుమారు ఖర్చు: రూ.3,600 కోట్లు.
డోర్నకల్ – మిర్యాలగూడ మధ్య కొత్త లైన్. ఈ కొత్త లైన్ నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ వంటి ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది. దీంతోపాటుగా ఆయా ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిసర ప్రాంతాల పారాబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ రైల్వే లైన్ కీలకం కానుంది. పొడవు: 120 కి.మీ. సుమారు ఖర్చు: రూ.2,160 కోట్లు.
భద్రాచలం (పాండురంగాపురం) – మల్కన్గిరి (జునాగడ్) న్యూ లైన్. శ్రీరామచంద్రుడు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం, దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం పట్టణానికి ఇంతవరకు నేరుగా రైల్ కనెక్టివిటీ లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ చిరకాల ఆకాంక్ష కూడా నెరవేరనుంది. హైదరాబాద్, ఢిల్లీ – చెన్నై ప్రధాన రైల్వే లైన్ కు ఈ ప్రాజెక్టు కనెక్ట్ అవుతుంది. దీంతోపాటుగా ఒడిశా, తెలంగాణలోని గనులకు.. కాకినాడ పోర్ట్ తో అనుసంధానం చేస్తుంది. పొడవు: 186 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.3,592 కోట్లు.
తాండూరు సిమెంట్ క్లస్టర్ – జహీరాబాద్ న్యూ లైన్. ఈ లైను కారణంగా తాండూరు, వికారాబాద్, జహీరాబాద్ మధ్య 65 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల.. సికింద్రాబాద్, వాడి మద్యలో.. సిమెంట్ క్లస్టర్ నుంచి సరుకును పుణే, ముంబై లకు తరలించేందుకు మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా.. వికారాబాద్, తాండూరు సెక్టార్లో ప్రస్తుతమున్న 12 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సమీప భవిష్యత్తులో 25 మిలియన్ టన్నులకు చేరుకునేందుకు వీలుపడుతుంది. 75 కి.మీ లైన్ పొడవుతో అంచనా వ్యయం సుమారు రూ. 1,350 కోట్లు. దీంతోపాటుగా ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గడ్-చందూర్ ప్రాంత్రం అనుసంధానత కారణంగా.. ఆదిలాబాద్ పరిసర ప్రాంతమైన గడ్-చందూర్ ప్రాంతంలోని బొగ్గును పర్లి, హోటగీ, కూడగి పవర్ ప్లాంట్ లనుతరలించేందుకు వీలవుతుంది. 71 కి.మీల ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు: రూ.1,278 కోట్లు.
తెలంగాణ – ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని గనులను, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే 180 కిలోమీటర్ల కొత్తగూడెం – హుట్గి – కిరండోల్ కొత్త లైన్ కోసం.. రూ. 3,240 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పంఢరిపూర్, పర్లిలకు అనుసంధానించే బోధన్ – లాతూర్ మధ్య కొత్త లైన్ కోసం (135 కిలోమీటర్లు) రూ. 2,430 కోట్లతో అంచనాలను సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. ఈ మెగా ప్రాజెక్టులన్నింటికీ.. ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) చేయడానికి భారత ప్రధాని అంగీకరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ FLSకు రైల్వే శాఖ నిధులు కూడా మంజూరు చేసింది.
ఇవి కాకుండా డబ్లింగ్ లైన్ ప్రాజెక్టులు..
715 కోట్లతో డోర్నకల్ – భద్రాచలం రోడ్
1,157 కోట్లతో మోటుమారి – విష్ణుపురం
2,314 కోట్లతో నిజామాబాద్ – పెద్దపల్లి
3,484 కోట్లతో వికారాబాద్ – పర్లి వైద్యనాథ్
273 కోట్లతో మౌలాలీ – సనత్ నగర్ మధ్య
2,379 కోట్లతో.. ముద్-ఖేడ్ – ఆదిలాబాద్ – పిపంల్ కుట్ట మధ్య డబ్లింగ్ లైన్ల నిర్మాణం కానుంది.
ట్రిప్లింగ్ లైన్లు..
1,352 కోట్లతో డోర్నకల్ – మణుగూరు వయా కొత్తగూడెం
1,118 కోట్లతో సికింద్రాబాద్ – కాజీపేట
2,379 కోట్లతో సికింద్రాబాద్ – వాడి ట్రిప్లింగ్ లైన్లు రానున్నాయి.
క్వాడ్రప్లింగ్ లైన్లు..
1,560 కోట్లతో కాజీపేట – సికింద్రాబాద్
3,042 కోట్లతో కాజీపేట – బల్లార్షా
2,860 కోట్లతో కాజీపేట – విజయవాడ
2,522 కోట్లతో సికింద్రాబాద్ – వాడి మధ్య క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం జరగనుంది.
డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ (4 లైన్లు) ప్రాజెక్టులను మినహాయిస్తే.. కొత్తగా వచ్చిన రైల్వే లైన్ల కారణంగా.. తెలంగాణలో ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ లేని నియోజకవర్గాలు, ప్రధాన పట్టణాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. దాదాపు లక్ష జనాభా దాటిన పట్టణాలు, నగరాలతో ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా అనుసంధానం కానున్నాయి. ఇది కచ్చితంగాతెలంగాణలో అభివృద్ధికి కొత్త బాటలు వేయనుంది. కనెక్టివిటీ పెరగనున్న నియోజకవర్గాలు ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, సంగారెడ్డి, పటాన్చెరు, కొరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, రామగుండంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు రైలు అనుసంధాన పెరగనుంది.