ఇప్పటం వెళ్లకుండా పవన్ను అడ్డుకున్న పోలీసులు
గుంటూరు,నవంబర్ 5 (ఆంధ్రపత్రిక): మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను మంగళ గిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ను ఆపేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. పవన్ కల్యాణ్ వెంటనే కారు దిగి కార్యకర్తలతో కలిసి ఇప్పటం వెళ్లారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలకు చెందిన.. 53 ఇళ్లు, ప్రహారీ గోడలు కూల్చివేశారు. జనసేన మీటింగ్కు స్థలం ఇచ్చారనే కారణంగా కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోప ిస్తున్నారు. ఇప్పటంలోని బాధితులను పరామర్శించేందుకు పవన్ ఇవాళ ఇప్పటం బయల్దేరారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దులో ముళ్ల కంచెలు పెట్టారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. తీవ్రఉద్రిక్త పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు. గ్రామంలో పవన్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూల్చివేతలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న గ్రామంగా ఉన్న ఇప్పటంలో రోడ్ల విస్తరణ ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజలంతా పూజించే నంది విగ్రహాన్ని, పీవీ నరసింహరావు విగ్రహన్ని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామం ఏమైనా కాకినాడా, రాజమండ్రా అని ప్రశ్నించారు. వైసీపీ ఇలాగే చేస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు.