ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయింపు సస్పెన్స్ థ్రిల్లర్ ఎపిసోడ్లను తలపించింది. తమకు అనుకూలమైన వారికి టిక్కెట్లు ఇప్పించుకుని సీనియర్లు తమ పంతం నెగ్గించుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో రేవంత్ జోక్యానికి చెక్ పెట్టినట్లేనా..? రాజకీయ ఉద్దండెలున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ టికెట్ల పంచాయితీలో ఏం జరిగింది..? అన్న చర్చ మొదలైంది.
కాంగ్రెస్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే జిల్లా ఉమ్మడి నల్లగొండ. రాష్ట్ర కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్న జిల్లా ఇది. కాంగ్రెస్ దిగ్గజ నాయకులంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలోని సీనియర్లు జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హేమాహేమీలుగా ఉన్నారు. ఈ జిల్లా సీనియర్ నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయింపు సస్పెన్స్ థ్రిల్లర్ ఎపిసోడ్లను తలపించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు మూడు జాబితాల్లో 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ కు కీలకమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు చివరి తంతు.. నరాలు తెగే తీవ్ర ఉత్కంఠ రేపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోకీలకమైన సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో పలు దఫాలుగా స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించినా కొలిక్కి రాలేదు.
సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికే..
సూర్యాపేట టికెట్ కోసం సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్రంగా పోటీ పడ్డారు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్న దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరించారు. ఇప్పటిదాక పార్టీ లైన్ దాటలేదనే పేరు ఉంది. ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలైన దామోదర్ రెడ్డికి కాకుండా రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ వర్గం పట్టుబట్టింది. పటేల్ రమేష్ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రికమండ్ చేయగా, సీనియర్ నేత దామోదర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ సీనియర్లు మద్దతు పలికారు. టికెట్ కోసం ఆశావాహులిద్దరూ ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నించారు. కానీ చివరికి ఏఐసీసీ పెద్దలు దామోదర్ రెడ్డి వైపు మొగ్గు చూపి టికెట్ కేటాయించింది.
అద్దంకి దయాకర్కు మొండి చేయి..
ఇక తుంగతుర్తిలో సీనియర్ నేత అద్దంకి దయాకర్కు మొండి చేయి చూపింది కాంగ్రెస్ అధిష్టానం. ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తిపై కూడా సస్పెన్స్ కొనసాగింది. తుంగతుర్తిలో కాంగ్రెస్ పదిహేనేళ్లుగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈ టికెట్ కోసం చాల మంది ఆశావాహులు పోటీపడ్డారు. ఈ నియోజక వర్గంపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. గడిచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల సామేల్, మోత్కుపల్లి నరసింహులు, నగరిగారి ప్రీతం, పిడమర్తి రవి టికెట్ కోసం పోటీ పడ్డారు. తన అనుచరుడు అద్దంకి దయాకర్ కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మందుల సామేల్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నించి సఫలమయ్యారు.
మిర్యాలగూడలో పంతం నెగ్గించుకున్న ఎంపీలు..
ఉత్కంఠ రేపిన మరో స్థానం మిర్యాలగూడ నియోజకవర్గం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు చిత్తు కావడంతో పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇక్కడి నుంచి మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ టికెట్ ఆశించారు. జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వడంతో, మిర్యాలగూడలో రఘువీర్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపింది. బీఎల్ఆర్కు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలిద్దరూ అనుకూలంగా స్క్రీనింగ్ కమిటీ చర్చలో మద్దతు పలికారు. మిర్యాలగూడ పై తన పట్టునునిలుపుకునేందుకు జానారెడ్డి ఈ స్థానాన్ని సీపీపీఎంకు ఇవ్వాలని గట్టిగా ప్రతిపాదించారు. అయితే అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇవ్వాలని.. బీఎల్ఆర్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
16 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరి మునుగోడు బరిలో నిలిచారు. ఇక ఆలేరులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు బీర్ల ఐలయ్యకు కాంగ్రెస్ టికెట్ సంపాదించాడు.
రేవంత్ వర్సెస్ సీనియర్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ సీట్లను తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకుని సీనియర్లు తమ పంతం నెగ్గించుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ టికెట్ తో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, ఆలేరు నుంచి తన అనుచరు బీర్లు ఐలయ్యకు, మిర్యాలగూడ నుంచి బిఎల్ఆర్కు, తుంగతుర్తి నుంచి మందుల సామెల్కు టికెట్ ఇప్పించుకుని రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించారు. మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు హుజూర్నగర్ టికెట్తో పాటు కోదాడ నుంచి తన సతీమణి పద్మావతికి టికెట్ ఇప్పించుకున్నారు. మిర్యాలగూడలో బిఎల్ఆర్ కు టికెట్ వచ్చేలా తన మద్దతు ప్రకటించారు.
ఉమ్మడి నల్లగొండ లోని 12 సీట్లు తమకు అనుకూలమైన వారికి ఇప్పించుకుని సీనియర్లు తమ పంతం నెగ్గించుకున్నారు. తమ వర్గానికి చెందిన వారికే టికెట్ వచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి చేసిన ఉత్తమ్, కోమటిరెడ్డిలు చివరకు తమ పట్టు నిలుపుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేవంత్ వర్గానికి చెక్ పెట్టారని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పీసీసీ రేవంత్ రెడ్డి జోక్యాన్ని జిల్లా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. భారత్ జోడో యాత్ర సన్నాక సమావేశాన్ని కూడా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. టికెట్ల కేటాయింపులో కూడా తన అనుచరులకు సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, మునుగోడులో కృష్ణారెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కు టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎదురైంది. తాజా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పీసీసీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం సీనియర్ వర్సెస్ రేవంత్ గా మారింది.