ఎన్నికల కోసం రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే విజయదశమి నాడు ప్రకటించాలనుకున్న టీడీపీ మేనిఫెస్టో కూడా ఇక లేనట్లే అంటున్నారు ముఖ్య నేతలు…రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తుండటంతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల కోసం మొదటి విడత మేనిఫెస్టో లో మహిళలు, రైతులు, యువతను పరిగణనలోకి తీసుకున్నారు చంద్రబాబు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదరడంతో రెండు పార్టీలు ఉమ్మడి వేదిక ద్వారా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఉమ్మడి కార్యాచరణ కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నాయి ఇరు పార్టీలు. ఇప్పటికే దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. సాధారణ ఎన్నికలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు రకరకాల వ్యూహాలతో ముందుకెళ్లారు. తన వైఖరికి భిన్నంగా అభ్యర్ధులను ప్రకటించుకుంటూ రావడం, ఇంచార్జిల నియామకాలతో దూకుడుగా ముందుకెళ్లారు చంద్రబాబు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో జనంలోకి వెళ్లారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో మొదటివిడత మేనిఫెస్టో ప్రకటించినచంద్రబాబు. వచ్చే విజయదశమి రోజు మహిళల సమక్షంలో మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పారు. ఇంతలో ఉన్నట్టుండి అధినేత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్క సారిగా కుదుపు వచ్చింది. పార్టీ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. దాదాపు 20 రోజులకు పైబడి పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. పార్టీ నేతలు, కార్యకర్తలంతా తమ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్కు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు తప్ప పార్టీలో ఇతర కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అయితే నాలుగురోజుల క్రితం ఏర్పాటు చేసిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే పనిలో పడింది. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదరడంతో రెండు పార్టీలు ఎలా సమన్వయం చేసుకోవాలనే దానిపై పొలిటికల్ యాక్షన్ కమిటీఫోకస్ పెట్టింది. రెండు పార్టీల నాయకులతో కలిసి త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు నిర్వహించేలా ముందుకెళ్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో మిత్రపక్షాలు ఉన్నాయి.
పొత్తుల తర్వాత మారనన్న మేనిఫెస్టో
ఎన్నికల కోసం రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే విజయదశమి నాడు ప్రకటించాలనుకున్న టీడీపీ మేనిఫెస్టో కూడా ఇక లేనట్లే అంటున్నారు ముఖ్య నేతలు. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తుండటంతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల కోసం మొదటి విడత మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతను పరిగణనలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇక పూర్తి మేనిఫెస్టోలో మహిళలకు మరిన్ని వరాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల కోసం మరిన్ని పథకాలు పెట్టనున్నట్లు తెలిసింది. ఇక అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళేది కూడా మేనిఫెస్టోలో పెడతారని తెలిసింది. అయితేఈలోగా జనసేన కూడా టీడీపీకి తోడు కావడం, ఎన్నికలకు కలిసి వెళ్తుండటంతో వైసీపీపై గెలిస్తే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకే ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది రెండు పార్టీల ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే మేనిఫెస్టోలో అంశాలపై టీడీపీ ఒక స్పష్టతకు రాగా… జనసేన అధినేత పర్యటనల్లో కొన్ని హామీలు ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు పార్టీల తరపున అధికారికంగా ఏం చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా టీడీపీ నుంచి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ నిత్యం టచ్ లోనే ఉంటున్నట్లు తెలిసింది.
పవన్ వారాహి యాత్ర తర్వాత ఉమ్మడి కార్యాచరణ
అక్టోబర్ ఒకటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. 6 రోజులపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాత్ర సాగనుంది. అవనిగడ్డ,మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో వారాహి విజయ యాత్ర కొనసాగనుంది. వారాహి యాత్ర ముగిసే నాటికి ఉమ్మడి జేఏసీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎన్నికల కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై రెండు పార్టీలు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.