ఆ ఉత్తర్వులను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి,నవంబర్ 1 (ఆంధ్రపత్రిక): ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం అమలును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. నిషేధం అమలుకు సమ యం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది.సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రి మార్చుకోవాలని తయారీదారులు ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులకు సూచించారు. సామగ్రి తరలించేందుకు రూ.20లక్షల వరకు రుణం ఇవ్వాలని.. ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దును జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశించారు.2027 కల్లా ప్లాస్టిక్ కాలుష్యం లేని రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని పేర్కొంటూ ఇటీవల ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నవంబరు 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తాజాగా ఆ ఉత్తర్వులను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.