- 1200 ఆస్తుల సేకరణలో భాగంగా 400కు నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీ: ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(MGBS-Chandrayanagutta) వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రోమార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణను ప్రారంభించారు.
ఈ రూట్లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి దాదాపు 1200 వరకు ఆస్తులు అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. మొదటి దశలో కారిడార్-2లో భాగంగా జేబీఎస్ నుంచి ఫలక్నుమా(Falaknuma) వరకు 15 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఎంజీబీఎస్ దాటిన తర్వాత ఫలక్నుమా వరకు చేపట్టనున్న నిర్మాణంలో మతపరమైన కట్టడాలు, ప్రార్థనా మందిరాలను తొలగించాల్సి వస్తుండడంతో అప్పట్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.
దీంతో ఎల్అండ్టీ సంస్థ పనులను ఎంజీబీఎస్ వరకే పూర్తి చేసి అక్కడి వరకే రైళ్లను నడిపిస్తోంది. పనులపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి దశలో ఫలక్నుమా వరకు ఆగిన 5.5 కిలోమీటర్లకు అదనంగా చాంద్రాయణగుట్ట(Chandrayanagutta) మరో 2 కిలోమీటర్లను పొడిగించి, అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. పనులకు ఈ ఏడాది మార్చి 8న సీఎం రేవంత్రెడ్డి ఫలక్నుమా వద్ద శంకుస్థాపన చేశారు.
100 అడుగులతో రహదారి విస్తరణ
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న 7.5 కిలోమీటర్ల దూరం పనులను పకడ్బందీగా పూర్తి చేయనున్నారు. జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్ ప్రకారం 100 అడుగులతో రహదారి విస్తరణ చేపట్టనున్నారు. స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో విస్తరించనున్నారు. దారుల్షిఫా-శాలిబండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున విస్తరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట(Shalibanda to Chandrayanagutta) మధ్య ఒక్కో ఆస్తి 10 అడుగుల వరకు విస్తరించాల్సి ఉంటుందని,
స్టేషన్ల్లు, వంపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్థతులతో పాటు 3డీలో వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వే కూడా చేపడుతున్నారు. మెట్రో నిర్మాణంలో కోల్పోతున్న ఆస్తుల విలువను అంచనా వేసేందుకు హెచ్ఏఎంఎల్ ఇంజినీర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. మెట్రో మార్గం వెంబడి ఉండే 103 మతపరమైన, సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
8 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు
పాతబస్తీ మెట్రో నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. 400 ఆస్తుల సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం.ఆస్తులు కోల్పోతున్న యజమానులు రసూల్పురాలోని హెచ్ఏఎంఎల్ భూసేకరణ అధికారి కార్యాలయంలో అభ్యంతరాలు తెలియజేయవచ్చు. వివరాలు పొందవచ్చు. భూసేకరణ చట్టాన్ని అనుసరించి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని 8 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.