Gudlavalleru College of Engineering: కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది.
విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూమ్లల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు.
హాస్టల్ బాత్రూమ్లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గానీ, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి గానీ ఎవరూ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదని తెలుస్తోంది.