స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14 వ తేదీన ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్.. జాతీయ నేతలతో భేటీ అవుతూనే.. పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, దానికి ముందు రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుతో.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ములాఖత్ అయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14 వ తేదీన ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్.. జాతీయ నేతలతో భేటీ అవుతూనే.. పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, దానికి ముందు రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుతో.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జైలు వద్దనే మీడియాతో మాట్లాడుతూ పొత్తుల ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్తుందని ప్రకటించారు. టీడీపీకి తాను అండగా ఉంటానన్నారు. అదే రోజు నారా లోకేష్ కూడా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తామని తెలపారు.
ఇదంతా జరిగిన రోజే నారా లోకేష్ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. సుమారు మూడు వారాలు తర్వాత లోకేష్ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 కి గన్నవరం ఎయిర్ పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా నారా లోకేష్ రాజమహేంద్రవరం వెళ్లనున్నారు.
మూడు వారాలపాటు ఢిల్లీ నుంచే వ్యవహారాలు నడిపిన లోకేష్..
సెప్టెంబర్ 14వ తేదీన రామహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లారు లోకేష్. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉండి అన్ని వ్యవహారాలు నడిపించారు. చంద్రబాబు విడుదలకు సంబంధించి ఆయన కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. చంద్రబాబుపై పెట్టిన కేసు ఫాల్స్ కేసు అంటూ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, అక్టోబర్ 5వ తేదీన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై ఏదొక నిర్ణయం వస్తే వెంటనే రాష్ట్రానికి రావాలని లోకేష్ అనుకున్నారు. కానీ, ఆ కేసు విచారణ అక్టోబర్ 9వ తేదీకి వాయిదా పడటంతో లోకేష్ రాష్ట్రానికి వస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికివస్తే లోకేష్ను కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా లోకేష్ కొన్ని రోజులపాటు అరెస్ట్ కాకుండా హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. ఇదంతా జరుగుతూ ఉండగానే నారా లోకేష్ పార్టీ కార్యక్రమాలను కూడా ఢిల్లీ నుంచి పర్యవేక్షించారు. ఒక పక్క లోకేష్ ఢిల్లీలో.. మరోవైపు రాజమండ్రిలో నారా భువనేశ్వరి నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు సమయం ఉండటం. చంద్రబాబుతో ములాఖత్ అయి రోజులు గడవటంతో నారా లోకేష్ రాష్ట్రానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఆ సమయానికి తిరిగి లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక అక్టోబర్ 10 వ తేదీన ఇన్నర్ రింగ్రోడ్డు అక్రమాల కేసులో సీఐడీ విచారణకు హాజరుకావాలని లోకేష్ను కోర్టు ఆదేశించింది. తిరిగి 10వ తేదీన విజయవాడకు నారా లోకేష్ రావాల్సి ఉంది.
రేపు రాజమండ్రిలో చంద్రబాబుతో భేటీ కానున్న లోకేష్..
ఇవాళ రాత్రి 8.30 కు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న నారా లోకేష్.. అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. శుక్రవారం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయితే, ఈ రోజే విజయవాడలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిలు పిటిషన్పై విచారణ జరగనుంది. విచారణ ముగిసిన తరువాత కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు భేటీ పై స్పష్టత రానుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తే సరేసరి లేదంటే.. జైలులోనే చంద్రబాబుతో నారా లోకేష్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రిలో పార్టీ నేతలతోనూ భేటీ కానున్న నారా లోకేష్.. జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం..