Kenya Cult Death: కెన్యాలో ఓ చర్చి పాస్టర్ నిర్వాకం ఘోర విషాదానికి కారణమైంది. ఆయన చెప్పిన మాటల పుణ్యమా అని 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. ఇంతకీ.. ఆ పాస్టర్ ఏం చేశాడు..? ఎందుకంత మంది చనిపోయారు..? అసలేం జరిగిందంటే.. ఆకలితో..
Kenya Cult Death: కెన్యాలో ఓ చర్చి పాస్టర్ నిర్వాకం ఘోర విషాదానికి కారణమైంది. ఆయన చెప్పిన మాటల పుణ్యమా అని 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. ఇంతకీ.. ఆ పాస్టర్ ఏం చేశాడు..? ఎందుకంత మంది చనిపోయారు..? అసలేం జరిగిందంటే.. ఆకలితో అలమటించి చనిపోతే జీసెస్ను కలుస్తారని తన అనుచరులను నమ్మబలికాడు కెన్యాలోని ఓ పాస్టర్. ఆ పాస్టర్ మాటలు నమ్మిన నిరాహార దీక్ష చేయడంతో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత నెల రోజుల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం ఒక్కరోజే 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు అధికారులు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదని..వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు కెన్యా అధికారులు.
2019లో పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు ఉద్బోధించాడు. దాంతో.. నిరాహార దీక్షలు మొదలుపెట్టిన అనుచరులు.. డజన్ల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
అయితే.. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు గుర్తించడం సంచలనంగా మారింది. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక.. గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేయడంతో పాస్టర్ బాగోతం బట్టబయలైంది. కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలవాటు ఉండడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.