కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ నిర్ణయాన్ని స్వాగతించిన జనచైతన్య వేదిక.
ANDHRAPATRIKA గుంటూరు 21-02-2023 ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మార్పు రావడానికి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ నిర్ణయం దోహదపడుతుందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.ఈ నెల 21వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ మరో బీహార్ గా మారరాదని, అభివృద్ధి వైపు పురోగమించాలన్నారు.రాజధానిని మూడు ముక్కలు చేసినంతమాత్రాన అభివృద్ధి వికేంద్రీకరణ జరగదన్నారు.26 జిల్లాలలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచాలన్నారు. అవస్థాపక సౌకర్యాలను కల్పించి పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు.విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలిపారు.పుచ్చలపల్లి సుందరయ్య,వావిలాల గోపాలకృష్ణయ్య,ప్రకాశం పంతులు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ నేతల కృషి చేయాలన్నారు.బూతులు తిట్టడం, రాజకీయ పార్టీల ఆఫీసులను ధ్వంసం చేయడం లాంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను మార్చి 4వ తేదీన విజయవాడలో ప్రారంభిస్తున్నామని వివరించారు. మేధావులు,రిటైర్డ్ అధికారులు, పలు ప్రజా సంఘాలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.