హైదరాబాద్, మే 9: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) ఓ పరాన్న జీవి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
(Former minister Jagadish Reddy) వ్యాఖ్యలు చేశారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ”నా ఆస్తులు, కోమటి రెడ్డి ఆస్తుల లెక్కలు తీయండి. ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో తెలుస్తుంది” అని అన్నారు. రేవంత్ రెడ్డివి (CM Revanth Reddy) అజ్ఞానపు మాటలు అని వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి తెలీయకుండా హామీలు ఇవ్వడం మోసమే అని చెప్పుకొచ్చారు.
గతంలో కంటే తమ ఓట్లు పెరుగుతున్నాయన్నారు. జానారెడ్డి (Janareddy) బీఆర్ఎస్ నేతల ఇండ్లకు వెళ్లి కండువా కప్పుతున్నారన్నారు. బిల్లులు ఇవ్వమని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత శాన్ పిట్రాడోవి పిచ్చి మాటలని కొట్టిపారేశారు రాజకీయం కోసమే మోదీ (PM Modi) ఆయన మాటలు పట్టించుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్లో సగం మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారే అని.. అంటే తాము బలంగా ఉన్నట్టే కదా? అని అన్నారు. ఎంత పెద్ద వర్షం వచ్చినా తాము రెండు గంటల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు.
”నాకు ఫోజులు కొట్టడం అలవాటు లేదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టిన అని నేను ఎప్పుడైనా చెప్పానా. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం ఓ వర్గం మనోభావాలు దెబ్బ తీయడమే. ఈసీ అలా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలి. ఉన్న రిజర్వేషన్లు తొలగించడానికి మేం వ్యతిరేకం. వేల మూటలు ఢిల్లీకి వెళుతున్నాయని మోదీ అంటున్నారు. తెలిసి కూడా మోదీ ఎందుకు పట్టుకోవడం లేదు? ట్యాపింగ్ వ్యవహారం కొత్తది కాదు. ఉద్యమ కాలంలో మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఏ భార్య భర్త ఫోన్ మాటలు విన్నారు.. ఎవరైనా ఫిర్యాదు చేశారా?” అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.