పల్నాడులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కరువు పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా వర్షం చుక్క కూడా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. వర్షం లేకపోవడంతో పచ్చగడ్డి లభ్యం కావటం లేదు. పొలం గట్లు వెంట పంటలతో పాటు పచ్చగడ్డి పెరుగుతుంది. మరికొన్ని చోట్ల చొప్పను రైతులు వేస్తారు. అయితే వర్షాభావ..
పల్నాడులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కరువు పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా వర్షం చుక్క కూడా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. వర్షం లేకపోవడంతో పచ్చగడ్డి లభ్యం కావటం లేదు. పొలం గట్లు వెంట పంటలతో పాటు పచ్చగడ్డి పెరుగుతుంది. మరికొన్ని చోట్ల చొప్పను రైతులు వేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పచ్చగడ్డి పెరగలేదు. మరోవైపు చొప్ప కూడా ఎండిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎండుగడ్డి కొనక తప్పటం లేదు.
అయితే పల్నాడు ప్రాంతంలో ఈ ఏడాది వరి సాగు లేదు. సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో వరి సాగు పూర్తి స్థాయిలో లేదు. నీటి వసతి ఉన్న బోర్లు, చెరువుల కింద మాత్రమే వరిని రైతులు పండిస్తున్నారు. ఇప్పుడప్పుడే ఎండు గడ్డి వచ్చే పరిస్థితులు లేవు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రాంతం నుండి ఎండుగడ్డిని తీసుకొచ్చి పల్నాడు ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో ఎండుగడ్డి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లారీల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతం నుండి ఎండుగడ్డిని తీసుకొచ్చి బొల్లా పల్లి మండలంలో విక్రయిస్తున్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. లారీ వచ్చిన అరగంటలోనూ ఎండు గడ్డి అమ్మకం అయిపోతుంది.
నాలుగు రోజుల క్రితం వరకూ 20 కేజీల ఎండుగడ్డి 250 రూపాయల ధర పలకగా నిన్నటి నుండి మాత్రం 200 వందలకే విక్రయిస్తున్నారు. తమ పొలాల్లో పచ్చి గడ్డి లేదని తప్పనిసరి పరిస్థితుల్లో ఎండుగడ్డిని కొని పశువులను కాపాడుకుంటున్నామని రైతులు అంటున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ నుండి పశుగ్రాసం పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో విక్రయించేందుకు కొంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో లారీలు పల్నాడు బాట పట్టాయి.