ఓవైపు పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే.. దీనినే అదునుగా మార్చుకొని కొందరు సైబర్ నేరగాళ్లు దోపిడికి దిగారు. ఉచితాన్ని ఎరవేస్తూ ప్రజలను దోచుకునే కుట్ర చేస్తున్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఫోన్ రీఛార్జ్ ఇస్తున్నారంటూ వాట్సాప్, ఫేస్బుక్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా ముందువెనకా చూడకుండా వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నారు…
సమాజంలో నేరాలు జరిగే తీరు రోజురోజుకీ మారిపోతోంది. ఒకప్పుడు నేరుగా దాడి చేసి దోచుకునే వారు, కానీ ప్రస్తుతం ఎక్కడో కూర్చొని అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒక చిన్న లింక్ను పంపి దర్జాగా డబ్బులు కాజేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా, సైబర్ నేరాలు పెరిగాయని బాధపడాలా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఎన్నికల సీజన్ను కూడా వాడుకుంటున్నారు.
ఓవైపు పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే.. దీనినే అదునుగా మార్చుకొని కొందరు సైబర్ నేరగాళ్లు దోపిడికి దిగారు. ఉచితాన్ని ఎరవేస్తూ ప్రజలను దోచుకునే కుట్ర చేస్తున్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఫోన్ రీఛార్జ్ ఇస్తున్నారంటూ వాట్సాప్, ఫేస్బుక్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా ముందువెనకా చూడకుండా వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ మెసేజ్ కాస్త దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మూడు నెలలపాటు ఉచితంగా రీఛార్జ్ పొందాలంటే కింద పేర్కొన్న లింక్ను క్లిక్ చేయండి అనేది సదరు మెసేజ్ సారంశం. ఈ మెసేజ్ తెలుగులో కూడా ఉండడం గమనార్హం. ఈ మెసేజ్ కాస్త వైరల్ కావడంతో ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ స్పందించింది. ఫ్యాక్ట్ చెక్లో భాగంగా సదరు మెసేజ్ పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఎలాంటి మోసాలు జరిగినట్లు ఘటనలు వెలుగులోకి రాకపోయినా, ఇలాంటి ఫేక్ లింక్స్ను క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని అధిఆకరులు చెబుతున్నారు.
ఇక కేవలం ఫ్రీ రీచార్జ్ మాత్రమే కాకుండా.. ఎన్నికల వేళ కొన్ని పార్టీలు ఈ కామర్స్ సైట్స్లో డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు కొన్ని లింక్లు సైతం వైరల్ అవుతున్నాయి. సదరు లింక్ క్లిక్చేసి షాపింగ్ చేస్తే భారీగా డిస్కౌంట్ పొందొచ్చని సదరు మెసేజ్లో పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఫేక్ లింక్లను క్లిక్ చేయడం వల్ల ఖాతాల్లోని డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో వీటి జోలికి పోకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.