ఏపీ సీఎం చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. తాజాగా వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసారు.
ఈ రెండు స్థానాలు టీడీపీకి దక్కటం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ స్థానాల్లో పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పటికే చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీకి దూరంగా ఉంటున్న హీరో తారక్ కు చెక్ పెట్టేలా నిర్ణయం ఉండనుందని తెలుస్తోంది.
రాజ్యసభ అభ్యర్దులు
వైసీపీకి చెందిన రాజ్యసభ, శాసమండలి సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో..టీడీపీ ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటి వరకు మోపిదేవి, మస్తాన రావు రాజీనామా చేసారు. మరో సభ్యుడు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆ సభ్యుడు రాజీనామా చేయటం ఖాయమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మూడు లేదంటే రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి.
సుహాసినికి ఛాన్స్
టీడీపీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్నవారి జాబితాలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. మాజీ ఎంపిలు కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మీ, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్లతో పాటు పార్టీ సీనియర్ నేతలు టిడి జనార్ధన్, వర్ల రామయ్య ఉన్నారు. అయితే, చంద్రబాబు తాజాగా నందమూరి సుహాసినికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత..తెలంగాణలో పార్టీ భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయంగా భావిస్తున్నారు.
చంద్రబాబు వ్యూహం
ఒక సీటు సుహాసినికి కేటాయిస్తే..మరో సీటు గల్లా జయదేవ్, సానా సతీశ్, జనసేన నుంచి నాగబాబు పేర్లు పరిశీలనలోఉన్నాయి. ఆలపాటి, పనబాకలకు కూటమి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించలేదు. వర్ల రామయ్యకు చేతిదాక వచ్చిన రాజ్యసభ సీటును గతంలో కనకమేడలకు కేటాయించడంతో దక్కలేదు. దీంతో ఈసారైనా వర్లకు వస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అదే సమయంలో సుహాసినికి రాజ్యసభ ఇవ్వటం ద్వారా..పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టేలా కొత్త వ్యూహం సిద్దమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోెంది.