IT Employees Car Rally: చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ టు రాజమండ్రికి తలపెట్టిన ర్యాలీతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ భారీ కార్ ర్యాలీకి హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి భారీ కార్ ర్యాలీకి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే, ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ర్యాలీతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో టెన్షన్ నెలకొంది. ఐటీ ఉద్యోగుల ఛలో రాజమండ్రి ర్యాలీ నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదంటూ స్పష్టంచేశారు. ఈ మేరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలకు, యాత్రలకు అనుమతి లేదని.. ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీని ఆంధ్రప్రదేశ్లోకిఅనుమతించమని పోలీస్ శాఖ స్పష్టంచేసింది. నిబంధలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ర్యాలీ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో భారీగా పోలీసులను మోహరించారు. ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ హైవేతోపాటు.. ఏపీలోకి ప్రవేశించే పలు మార్గాల్లో ప్రతీ వాహనాన్ని చెక్ చేసేలా.. గరికపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వాహనాలను ఆపి పరిశీలిస్తున్నారు. ఏపీలోకి వచ్చే వాహనాలను క్షుణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీసిన తర్వాతే ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది.
ఇదిలాఉంటే.. చంద్రబాబు రెండో రోజు విచారణ, కార్ ర్యాలీ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.