స్కిల్ స్కాం డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పు ఇచ్చింది. కాగా, ఇదే కేసులో బాబు ఇటీవల మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరిగా లేదని.. కేసు కొట్టివెయ్యాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా ఇటీవల వాదనలు వినిపించారు. అటు.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉందనీ, ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. రెండువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి.. ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 16న జరిగిన సీఐడీ, చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు..
ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇచ్చి చంద్రబాబు బెయిల్ పొందారని ఏపీ హైకోర్టులో సీఐడీ వాదించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయరాదని సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్లో నిధుల మళ్లింపు ఎలా జరిగిందో పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు వివరించారు మూడు పది రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా మార్గం ద్వారా కోట్ల చిన్నప్ప అనే వ్యక్తి హైదరాబాద్కు డబ్బు తరలించారని తెలిపారు. నిధుల మళ్లింపు జరిగిందనే విషయాన్ని సీమెన్స్ సంస్థ కూడా నిర్థారించిందని పొన్నవోలు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుపై ఎవరైనా అభ్యంతరం చెప్తే వారిని 24 గంటల్లోపు బదిలీ చేస్తామని అప్పటి ప్రధాన కార్యదర్శి అధికారులకు హుకుం జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత డబ్బు ఒక్కసారే విడుదల చేయవద్దని అప్పటి ఆర్థిక కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. అంతే కాదు టీడీపీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఒక్కరే ఆడిటర్గా ఉన్నారని పొన్నవోలు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అంతే కాదు చంద్రబాబు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టుకు పొన్నవోలు విజ్ఞప్తి చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై బాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇద్దరి మధ్య హోరాహోరి వాదనలు జరిగాయి.