అరకులోయ, అక్టోబర్ 19, (ఆంధ్రపత్రిక): అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న పసుపులేటి నాగబాబుకు అరుదైన అవార్డు లభించింది. నైపుణ్యాభివృద్ధి కోర్సుల కోసం కంటెంట్ జనరేషన్, శిక్షకులకు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. విజయవాడలో కమిషనర్ ఆఫ్ కాలిజియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ జి.సత్యనారాయణ చేతులమీదుగా అధ్యాపకుడు నాగబాబు అవార్డు అందుకున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే రెండు కార్యక్రమాలు ఉన్నత విద్యారంగంలో, భవిష్యత్లో కీర్తించదగినవి కావడం, ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయడం పట్ల ఆయనను అధికారులు, పాలకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అవార్డు గ్రహీత పసుపులేటి నాగబాబును స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె.భరత్కుమార్ నాయక్, సిహెచ్.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ కె.పద్మావతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.విజయలక్ష్మి, కళాశాలల అధ్యాపక బృందం అభినందించారు. అతిపిన్న వయసులో సర్వీసులో చేరి తక్కువ వ్యవధిలో ఇటువంటి గౌరవం నాగబాబుకు దక్కడం ప్రశంసనీయమని ప్రిన్సిపాల్స్, బోధన సిబ్బంది అన్నారు.