ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత వైసీపీ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీ అనుచరులు రైతుల నుంచి భూముల కోసం నొక్కేసిన కమిషన్ తిరిగి ఇచ్చేసారు.
ఈ ఘటన ఇప్పుడు సంచనలంగా మారింది. టీడీపీ నేతల వద్ద రజనీ అనుచరుల అక్రమ వసూళ్ల పై పంచాయితీ పెట్టారు. దీంతో, సొమ్ము తీసుకున్న వారు తిరిగి రిటర్న్ చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రైతుల నుంచి కమిషన్
వైసీపీ హయాంలో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో విడదల రజిని రైతుల వద్ద కమీషన్గా తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేశారు. గ్రామానికి చెందిన చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, రైతు నాయకుడు గడిపూడి దశరథ రామయ్యలు అసలు ఏం జరిగిందో వెల్లడించారు.
తిరిగి చెల్లింపు
వీరి చెప్పిన వివరాల ప్రకారం . పసుమర్రుకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.మంత్రిగా రజిని హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం రూ.1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజిని తన అనుచరుల ద్వారా ముక్కు పిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గోడ తొలిగింపు
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు. ఈ నేపథ్యంలో రజిని మనుషులు రైతులకు రూ.90 లక్షలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన రూ.26 లక్షలు శుక్రవారం రైతులకు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీంతో,తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పసుమర్రు నుంచి జాతీయ రహదారి గుండా గొర్రెల మండి పక్కగా చిలకలూరిపేటకు వచ్చే మార్గంలో విడదల రజిని కుటుంబ సభ్యులు అడ్డంగా గోడ కట్టారు. ఆ మార్గంలో రాకపోకలకు వీలు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ గోడను రజిని కుటుంబ సభ్యులు తొలగించారు. ఆ మార్గంలో ఉన్న భూమిని తాము దానం చేస్తున్నట్లు పంచాయతీకి లిఖిత పూర్వకంగా తెలిపారు.