నవతెలంగాణ – ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్థులు ‘రాహోవన్ ‘ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు.
‘రామాయణ’ ఇతిహాసం ఇతివృత్తంగా ఆ స్కిట్ వేశారు. అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ.. అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అయితే, అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో ఆ స్కిట్పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేసి ఘటనపై దర్యాప్తు జరిపింది.
అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. స్కిట్ ప్రదర్శించినవారిలో సీనియార్లు, జూనియర్లు ఉన్నారు. వీరిలో సీనియర్లకు ఒక్కొక్కరికీ రూ.1.2లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ ఫైన్ వారి సెమిస్టర్ ఫీజుకు దాదాపు సమానం కావడం గమనార్హం. ఇక, జూనియర్లకు రూ.40వేలు చొప్పున జరిమానా వేయడంతో పాటు హాస్టల్ సదుపాయాలను పొందడంపై నిషేధం విధించింది.