జగన్ ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని పల్లెపల్లెనా వివరించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన సాధికార యాత్ర.. విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసిన వైసీపీ.. మూడో విడత యాత్ర చేపట్టింది. ఈ యాత్ర ఎన్ని రోజులు జరగనుంది? ఏయే నియోజకవర్గాల్లో జరగనుందనే వివరాల కోసం వాచ్ దిస్ స్టోరీ?
సామాజిక సాధికార యాత్రలతో జనం బాట పట్టిన వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమ పథకాల అమలు, నగదు బదిలీ ద్వారా పేద వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరిగే సభలకు ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు హాజరవుతున్నారు. ఇప్పటికే రెండువిడతల్లో యాత్రలు చేపట్టిన వైసీపీ నేతలు మూడో విడత కూడా ప్రారంభించారు. మూడో విడతలో భాగంగా రాప్తాడు నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు వైసీపీ నేతలు.
మూడో విడతలో భాగంగా డిసెంబర్ 29వ తేదీ వరకు యాత్ర సాగనుంది. ఈ విడతలో మొత్తం 33 చోట్ల సాధికార యాత్ర జరగనుంది. మంగళవారం చోడవరం, నందిగామ, రాయదుర్గంలో యాత్ర ఉంటుంది. డిసెంబర్ 7న అరకు, గుంటూరు వెస్ట్, మడకశిర.. డిసెంబర్ 9న టెక్కలి, నిడదవోలు, గుంతకల్లు.. డిసెంబర్ 11న నర్సీపట్నం, ఉండి, కమలాపురం.. డిసెంబర్ 12న పాతపట్నం, మైలవరం, కుప్పం.. డిసెంబర్ 13న విజయనగరం, కోడూరు.. డిసెంబర్ 14న శ్రీకాకుళం, అనపర్తి, పలమనేరులో బస్సుయాత్ర ఉంటుంది.
డిసెంబర్ 29న కాకినాడ, అనంతపురంలో యాత్ర
డిసెంబర్ 22న పాయకరావుపేట, మండపేట, ఆదోని.. డిసెంబర్ 23న విశాఖపట్నం నార్త్, తాడికొండ, పాణ్యం.. డిసెంబర్ 27న ఉంగుటూరు, పుట్టపర్తి.. డిసెంబర్ 28న పెనమలూరు, రాయచోటి.. డిసెంబర్ 29న కాకినాడ సిటీ, అనంతపురంలో యాత్రతో మూడో విడత ముగియనుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, సామాజిక వర్గాలకు పదవుల కేటాయింపును వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అక్టోబర్ 26న మొదలైన ఈ సామాజిక సాధికార యాత్ర.. 35 నియోజకవర్గాల్లో జరిగింది. నవంబర్ 15 నుంచి 29 వరకు జరిగిన రెండో విడతలో 33 నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. ఈ మూడో విడతతో 101 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తవుతుంది.