పోలవరం, ప్రత్యేక హోదాలపై కేంద్రానికి మరోమారు సీఎం జగన్ విజ్ఞప్తి దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ విభజన హామీలు నెరవేర్చాలని కోరిన ముఖ్యమంత్రి
ANDHRAPATRIKA – దిల్లీ
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీ పర్యటనలో మళ్లీ పాత అంశాలే తెరపైకి వచ్చాయి. గురువారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. ఎంపీలందరితో కలిసి పార్లమెంటుకు వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి వద్దకు మాత్రం ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరితో కలిసి వెళ్లారు. ప్రధానితో కలిసి ఫొటో దిగాక విజయసాయి కూడా వెళ్లిపోయారు. తర్వాత సీఎం ప్రధానితో ఏకాంతంగా మాట్లాడారు. ఆ భేటీ అనంతరం వైకాపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కొంతసేపు ఎంపీలతో కూర్చొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ పార్లమెంటుకు వచ్చి హోం మంత్రి అమిత్షాతో 25 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ధనుంజయ్రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలంతా కనిపించినప్పటికీ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాత్రం రాలేదు. ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి వెళ్లిపోయిన తర్వాత అవినాష్రెడ్డి ఒక్కరే పార్లమెంటు ఆవరణ నుంచి వాహనంలో బయటికెళ్లిపోవడం కనిపించింది. ప్రధానికి అందించిన వినతిపత్రాన్ని బహిర్గతం చేయలేదు. అయితే ప్రధానమంత్రితో సీఎం ప్రస్తావించిన అంశాలు అంటూ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీల వంటి అంశాలే యథాతథంగా ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతలాంటి అంశాలు దానిలో కనిపించలేదు.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన వివరాలు
1. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటికీ చాలా అంశాలు పెండింగులోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు.
2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినా కీలకాంశాలన్నీ పెండింగులోనే ఉన్నాయి.
3. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రావాల్సిన రూ.36,625 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలివ్వాలి.
4. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణపరిమితిపై ఆంక్షలు విధించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తర్వాత అందులో రూ.17,923 కోట్లు తగ్గించారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
5. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగిస్తోంది. కేంద్రం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవరూపం దాలుస్తుంది. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు పెట్టిన రూ.2600.74 కోట్లను కేంద్రం వెంటనే చెల్లించాలి. టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ.55,548 కోట్ల పోలవరం అంచనాలను వెంటనే ఆమోదించాలి. తాగునీటి సరఫరా అంశాన్నీ ప్రాజెక్టులో భాగంగానే చూడాలి. ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంపొనెంట్ వారీగా చూసే నిబంధనలను సడలించాలి. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది కాబట్టి ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిని పాటించాలి. పోలవరం నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి.
6. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలి.
7. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి.
8. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడేలా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
9. రాష్ట్రంలో 13 జిల్లాలను 26కి పెంచాం. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు వైద్య కళాశాలలతో కలిపి ప్రస్తుతం 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 జిల్లాలకు వీలైనంత త్వరగా కళాశాలలు మంజూరు చేయాలి.
10. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి.