వాళ్ల తీరే అంత.. వంద శాతం చేసినా.. విమర్శలు మానరు
- విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కీలక మార్పులు తెచ్చాం
- గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు ఏనాడైనా చేశాయా?
- ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం అర్ధంపర్ధం లేని అంశం
- చంద్రబాబు హయాంలో ప్రజా ధనం దుర్వినియోగం
- ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి,డిసెంబరు 20 (ఆంధ్రపత్రిక) : ప్రతిపక్ష టీడీపీ తీరును ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పనులను..గత ప్రభుత్వం కనీసం ఏనాడైనా ప్రయత్నించిందా? అని ఆయన నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి అన్ని రంగాల్లో కీలక మార్పులు తెచ్చారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక సాధికారత తీసుకుని రావటాన్ని ఒక యంలా చేస్తున్నారు. తరగతుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేస్తున్నారు ముఖ్యమంత్రి. గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో వచ్చిన మార్పును సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అభిమానం, ప్రేమతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి..గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు ఏనాడైనా చేశాయా? అని సజ్జల ప్రతిపక్షాలను నిలదీశారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం అర్ధంపర్ధం లేని అంశమన్న ఆయన.. 99.8 శాతం చేసినా వంద శాతం ఎందుకు చేయలేదు? అంటారని, వంద శాతం చేస్తే.. ఇంత ఆలస్యంగా ఎందుకు చేశారు? అంటారని అసహనం వ్యక్తం చేశారు. ‘’తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్నది ఆలోచించరు. చంద్రబాబు హయాంలో ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. ఒకవేళ తెలుగుదేశం చేసిన అరాచకాలు ఎగ్జిబిషన్ పెడితే రాష్ట్రం సరిపోద’’ని సజ్జల ఎద్దేవా చేశారు.