భారీ వర్షాలతో వణుకుతున్న చెన్న నగరం
- గత మూడు రోజులుగా తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు
- గత మూడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు
- పలు ప్రాంతాల్లో ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- నిండకుండని తలపిస్తున్న జలాశయాలు
- పాఠశాలలకు సెలవులు డిక్లేర్ చేసిన ప్రభుత్వం
చెన్నై,నవంబర్ (ఆంధ్రపత్రిక): తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, డెల్టా జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం ఏపీలో పలు జిల్లాల్లో కూడా కనిపిస్తోంది.
చెన్నై వాసులను భారీ వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ యేడాది నగరాలను భారీ వర్షాలు చుట్టుముడుతున్నాయి. మొన్న సిలికాన్ సిటీని ముంచెత్తిన వరదలు నేడు చెన్నపట్నాన్ని చివురుటాకులా వణికిస్తున్నాయి.గత మూడు రోజులుగా తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు తమిళ నాడు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.గత మూడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు తమిళనాడులో భీభత్సం సృష్టిస్తున్నాయి. నీల్గిరి, కరూర్, కడలూర్, అరియాలూర్, తిరువారూర్, తంజావూర్లలో వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీచేసింది. చెన్నై, నీల్గిరి, కోయంబత్తూర్, తిరుప్పార్, దిండిగల్, తేనిల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కుండ పోత వర్షాలకు తమిళనాడులోని జలాశయాలు నిండకుండని తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. తమిళనాడులో మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కాంచీపురంలో 21 సెంటి మీటర్లు, చెన్నై అవడిలో.. 18 సెంట మీటర్లు వర్షపాతం నమోదైంది.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదే శించారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలకై ఆదేశించారు. ఇక తమిళనాడులో భారీ వర్షాలకు విద్యావ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అనేక ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. చెన్నై, పుదుచ్చేరిలలో నాలుగు, ఐదు తేదీల్లో సైతం పాఠశాలలకు సెలవులు డిక్లేర్ చేసింది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించింది. చిదంబరంలోని యూనివర్సిటీ లకు సైతం సెలవులు ప్రకటింది ప్రభుత్వం.