తెలంగాణలో బిజెపికి స్థానం లేదు
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
హాథ్సే హాథ్ జోడో యాత్రలో రేవంత్
కరీంనగర్,మార్చి (ఆంధ్రపత్రిక): తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్ చేంజ్ సాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది. మల్లాపూర్?లో ఉన్న రేవంత్ రెడ్డి.. అక్కడి స్థానికులు, చిరువ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చిరు వ్యాపారులు తమకు బ్యాంకు నుంచి రావాల్సిన రుణాలు రావడం లేదని రేవంత్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ బిడ్డలను పీజీ చదివించినా ఇంతవరకు ఉద్యోగాలు రాలేదని కొందరు రేవంత్ వద్ద వాపోయారు. ఈసారి మహిళా శక్తిని చాటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన హావిూ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపటిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వేలాది మంది కార్యకర్తలు ఆయనతో కలిసి నడిచారు. గ్రామగ్రామాన మహిళలు మంగళహరతులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రజలకు భరోసాను ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విరుచకపడ్డారు. పలుమార్లు స్థానిక అంశాలను తీసుకొని కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతున్న సేపు యువకులు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఎంపీ బండి సంజయ్కి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో నయా జోష్ నింపింది. కొన్ని రోజులుగా నాయకులు, కార్యకర్తలు స్తబ్దతగా ఉన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో పెళ్లి అయిన నిర్వాసిత యువతులకు పరిహారం ఇవ్వకుంటే వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను వివరించారు.