టిడిపికి పోలవరం ఉచ్చరించే అర్హత లేదు
తన హయాంలోనే పూర్తి చేసి చూపుతా
అసెంబ్లీలో సిఎం జగన్ ప్రకటన
అమరావతి,మార్చి23(ఆంధ్రపత్రిక): పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేనే పోలవరమని అన్నారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీకి లేదన్నారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారి కూడా పోలవరం పేరు రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. టీడీపీ ధ్యాసంతా డబ్బుల విూదనే అని విమర్శించారు. దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానమని , టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల విూదే దృష్టి పెట్టిందని ఆరోపించారు . పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అన్న జగన్… ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని తెలిపారు. పోలవరం పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ సభకు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పోలవరంపై చర్చకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. టీడీపీ హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకెళ్లిందా?. పోలవరం అని పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. వైఎస్ కంటే ముందు పోలవరం గురించి ఎవరైనా ఆలోచించారా? అని జగన్ ప్రశ్నించారు. 2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నారని, పోలవరం అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? అని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రారంభించింది వైఎస్సార్.. పూర్తి చేసేది ఆయన కొడుకు అని వ్యాఖ్యానించారు. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అని, ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని జగన్ ప్రస్తావించారు.