విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి
– చెన్నెలో వేడుకగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం
-పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
andhrapatrika : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు చెన్నై నగరవాసులను ఆశీర్వదించడానికి ఇక్కడ కొలువుదీరారని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మఆశీస్సులు పొందుతున్న చెన్నై వాసులు అదృష్టవంతులని స్వామి చెప్పారు.
చెన్నై జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం శాస్త్రోక్తంగా,అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారదా పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి,చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శ్రీ శేఖర్ రెడ్డి కృషితో అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించారని అన్నారు. ఆలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీనటి కాంచన,వారి కుటుంబ సభ్యులు అదృష్టవంతులని, వారికి శ్రీ వేంకటేశ్వరస్వామి,శ్రీపద్మావతి దేవి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. స్వామివారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా తమిళులు తమ సొంతదైవంగా భావిస్తారని స్వామి చెప్పారు. తమిళ నాడులో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. మురుగన్ , శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో తమిళనాడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. దేశంలోని జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తి పీఠాల్లో కెల్లా తిరుమల శ్రీవారు గొప్ప దేవుడని స్వామి కొనియాడారు. ప్రపంచంలో వేదాలు ఇంకా బతికి ఉన్నాయంటే అది శ్రీవేంకటేశ్వర స్వామి దయేనని, స్వామి వేద పరిరక్షకుడని చెప్పారు.అంతకు ముందు టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశంలో తిరుచానూరు తరువాత శ్రీ పద్మావతి అమ్మవారు చెన్నై నగరంలోనే కొలువుదీరారని చెప్పారు. స్థలదాత సినీనటి కాంచన వారి కుటుంబసభ్యులు, టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శ్రీ శేఖర్ రెడ్డి సభ్యుల సహకారంతో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. శ్రీశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం అదృష్టమన్నారు.మహా కుంభాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ శంకర్, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవో శ్రీవీరబ్రహ్మం, ఆగమ సలహాదారు శ్రీశ్రీనివాసాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్,చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీసత్యనారాయణ,శ్రీవెంకటేశ్వర్లు, డిప్యూటి ఈవో శ్రీ విజయ కుమార్ , టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాలరావు, విజివో శ్రీమనోహర్, ఈఈ శ్రీమనోహర్ తో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.